రూ.100 కోట్ల విలువైన పరిశ్రమలకు అవకాశం
పద్మనాభం, జయజయహే : మండలంలోని కృష్ణాపురంలో ప్రతిపాదిత ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎం.ఎస్.ఎం.ఇ. కార్పొరేషన్ చైర్మన్ టి.శివశంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో శంకుస్థాపన చేస్తున్న మొదటి ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ కు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యావంతులైన గ్రామీణ యువత ఉపాధి కోసం దూరాలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ ల ఆలోచన చేశారని చెప్పారు. కృష్ణాపురం ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ లో రూ.100 కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటవుతాయని, రూ. 12.40 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. మొదటి దశలో 22 ఎకరాల్లో 163 ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ విధానమని, రాబోయే రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ ల వల్ల ఉత్తరాంధ్రలో ఉపాధి వలసలు తగ్గుతాయన్నారు. భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధికి విశేష అవకాశాలున్నాయని, తర్లువాడలో గూగుల్ కంపెనీ కోసం 200 ఎకరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.
ఇనాం రైతులకు ప్రభుత్వ పథకాలు
నియోజకవర్గంలో ఉన్న ఏడు ఇనాం గ్రామాల్లో రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పగా.. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్పందించారు. మూడు గ్రామాల్లో దీనికి సంబంధించిన రికార్డ్ పనులు పూర్తయ్యాయని, తొందర్లోనే రైతులందరికీ పాస్ బుక్ లు మంజూరు చేస్తామని ప్రకటించారు. యువ నాయకుడు గంటా రవితేజ, ఆర్డీఓ కె. సంగీత్ మాధుర్, పద్మనాభం మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ రమణ, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కూలిన స్టేజ్
కార్యక్రమం చివర్లో ఎక్కువమంది ఎక్కడంతో స్టేజ్ కూలిపోయింది. అయితే ముందుగానే అప్రమత్తమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరుల వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని సురక్షితంగా స్టేజ్ నుంచి కిందకు తీసుకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
పాండ్రంగి బ్రిడ్జి పనుల పరిశీలన
అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పాండ్రంగి బ్రిడ్జి పనుల ప్రగతిని గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. 6 నుంచి 9 నెలల్లో బ్రిడ్జి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు.