జయజయహే : : భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్ ఓ సి ) వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి ఇక్కడ ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం (ఇండియన్ ఆర్మీ ) వెల్లడించింది. పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్ఓసీ వద్ద అలజడి నెలకొనగా.. 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని తెలిపింది. ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్-పాకిస్థాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని గంటలకే పాక్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో దాయాది దేశం వెనక్కి తగ్గింది. దీంతో జమ్మూకశ్మీర్లోని నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏప్రిల్ 24 నుంచి ప్రతి రోజూ పాక్ కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఇక, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పౌర నివాసాలే లక్ష్యంగా దాయాది సైన్యం మోర్టార్ షెల్స్తో దాడులకు దిగింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడంతో భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాల నుంచి పౌరులను ఖాళీ చేయించారు. దీంతో గత కొద్ది రోజులుగా వారు సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు. అయితే, ఇప్పుడే స్వస్థలాలకు వెళ్లొద్దని సరిహద్దు గ్రామప్రజలను జమ్మూకశ్మీర్ యంత్రాంగం హెచ్చరించింది. పేలని షెల్స్ ఇంకా ఉంటాయని, వాటిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది. ఇక, పాకిస్థాన్తో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోనూ నిన్న రాత్రి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. అయినప్పటికీ భద్రతా బలగాలు పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి.
కాల్పుల మోత లేదు….19 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత
0
7
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -