ముంబై నటి కాదంబరీ జెత్వానీపై గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. డీజీ స్ధాయిలో ఉండి అరెస్టైన తొలి అధికారిగా విమర్శలు ఎదుర్కొన్న ఆయనకు ఊరటనిచ్చేలా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ముంబై నటి కాదంబరీ జెత్వానీని వేధించేందుకు ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపారని పీఎస్సార్ ఆంజనేయులుపై ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అడ్డుపెట్టుకుని పీఎస్సార్ ఆంజనేయులు ఈ కుట్ర పన్నారని, తన జూనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాతో పాటు ఇతర అధికారులతో కలిసి దీన్ని అమలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
అయితే ఈ కేసుకూ, తనకూ ఎలాంటి సంబంధం లేదని, తనకు విముక్తి కల్పించాలంటూ పీఎస్సార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పీఎస్సార్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాతో పాటు ఇతర అధికారులకూ ఇలాంటి ఊరటే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు పీఎస్సార్ కూ ఊరట దక్కింది.
మరోవైపు ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన కాదంబరీ జెత్వానీపై గతంలో వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని కూడా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుండటం విశేషం. వాటిని ఎత్తేయాలంటూ జెత్వానీ పలుమార్లు ప్రభుత్వ పెద్దల్ని కలిసి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేస్తున్న వరుస ఆదేశాలు ఆమెకు కలవరం పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తనపై కేసులు కొనసాగిస్తూ మరోవైపు తనను వేధించిన వారికి ఊరట ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె వాపోతోంది.