ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. కీలక నిర్ణయాలకు ఆమోముద్ర వేశారు.. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. ఈ ఏడాదిలో 25 కేబినెట్ సమావేశాలు జరిగాయి.. కొన్ని వందల నిర్ణయాలు ఇప్పటి వరకు తీసుకున్నాం.. సీఎంకు ఇష్టం వచ్చినప్పుడు కేబినెట్ పెట్టడం.. సీఎంకు ఇష్టమైన ఎజెండాతో కేబినెట్ సమావేశాలు పెట్టలేదు.. మంత్రుల అభిప్రాయంతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు.. 10 సెంట్ల స్థలం నుంచి ఎకరాల కేటాయింపు వరకు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు..
ఏపీ సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రకారం మరో విడత భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు పార్థసారథి.. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్.. విద్యా సంస్థలు.. ఆస్పత్రులు అందించే విధంగా భవిష్యత్ అవసరాల కోసం.. ల్యాండ్ పూలింగ్ జరుగుతుందన్నారు.. 2015లో కూడా 35 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది.. అసైన్మెంట్, భూముల విషయంలో స్థానిక అధికారులతో విచారణ తర్వాత భూ సమీకరణ జరుగుతుందన్నారు. అన్ని నియమ నిబంధనలు ప్రకారం.. ఆధార్, పాస్పోర్ట్ వివరాల ఆధారంగా ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది.. రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చే వారికి మెరుగైన ప్యాకేజ్ అందిస్తున్నాం అన్నారు.. అమరావతిలో జీఏడీ టవర్.. హెచ్వోడీ టవర్.. ఎన్సీసీ… షాపూర్జీ పల్లంజీకి, ఎల్ అండ్ టీకి టెండర్ ఆర్డర్ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు..
ఇక, మున్సిపల్ శాఖలో 40 టౌన్ ప్లానర్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. భవన నిర్మాణంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం మున్సిపల్ నిబంధనల సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు పార్థసారథి.. టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గండికోట ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కరోన వల్ల నిర్మాణ సంస్థల పనులు నిలిచి పోయాయి.. కరోన వల్ల వ్యాపారం దెబ్బ తిన్న కాంట్రాక్టర్లకు పనులకు సంబంధించిన టెండర్లలో ప్రాధాన్యత ఇచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు..
పోలవరం ప్రాజెక్ట్ 2027లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారని తెలిపారు మంత్రి పార్థసారథి.. ఇక, బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా వృథాగా పోయే నీటిని రెండు రాష్ట్రాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆలోచన. ఎవరికి నష్టం చెయ్యాలని. హక్కులు తీసుకోవాలని ఆలోచన లేదని స్పష్టం చేశారు.. అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సీఎం సూచన చేశారు.. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాంతంలో సాంస్కృతిక శాఖకు బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో స్టార్ హోటల్ నిర్మాణానికి ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి..