ఏపీలో నిరుద్యోగ యువతకు విద్యామంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. యువగళం పాదయాత్రలో వారికి ఇచ్చిన ఓ కీలక హామీపై అంతే కీలక ప్రకటన చేశారు. ఈ హామీని ఎప్పటి నుంచి నిలబెట్టుకుంటున్నారో ఆయన తాజాగా మచిలీపట్నంలో జరిగిన టీడీపీ కార్యకర్తల భేటీలో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున అందించే ఈ పథకం అమలుకు రంగం సిద్దమవుతోంది.
గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన నారా లోకేష్ ఆ సమయంలో తనను కలిసిన నిరుద్యోగ యువతకు ఓ హమీ ఇచ్చారు. అదే నిరుద్యోగ భృతి. రాష్ట్రంలో పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్న నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అనంతరం దాన్ని కూటమి మ్యానిఫెస్టో కూడా పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా ఈ పథకం ఇంకా అమలు కాలేదంటూ విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ క్లారిటీ ఇచ్చారు.బందరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల్ని ఈ ఏడాదే వరుసగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇక నిరుద్యోగ భృతి కూడా అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే లోకేష్ ఈ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసి నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ యువతకు సాయం అందించనున్నారు.