సురేశ్ ప్రొడక్షన్స్ కు నో రిలీఫ్
ప్రభుత్వ షోకాజు నోటీసుపై జోక్యం చేసుకోలేం
మధ్యంతర ఉపశమనం కుదరదు
రామానాయుడు స్టూడియోపై సుప్రీం కోర్టు
పిటీషన్ వెనక్కి తీసుకుంటామని వివరణ
జయజయహే : సురేష్ ప్రొడక్షన్స్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గతంలో జగన్ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్ సవాల్ చేసింది. దీనిపై ఈరోజు విచారణకు రాగా.. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా ధర్మాసనం విచారణ జరిపింది. అయితే పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం అడుగుతున్నారని.. అది కుదరదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పేసింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని అభయ్ ఒకా సూచించారు. పిటిషన్ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ తెలుపగా.. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. కాగా.. విశాఖలో సురేష్ ప్రొడక్షన్స్కు ఫిల్మ్సిటీ కోసం కేటాయించి భూములను ఇతర అవసరాలకు వాడేందుకు గత వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వైసీపీ సర్కార్ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. ఆ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని గుర్తించింది. దీంతో సురేష్ ప్రొడెక్షన్స్కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సురేష్ ప్రొడక్షన్స్కు కూటమి సర్కార్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులపై సుప్రీంను సురేష్ ప్రొడక్షన్స్ ఆశ్రయించింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. షోకాజు నోటీసులపై మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తన పిటిషన్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు సుప్రీం కోర్టుకు సురేష్ ప్రొడక్షన్స్ తెలిపింది.