భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం భగ్నం చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్(29).. హైదరాబాద్ కు చెందిన సమీర్(28).. నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లకు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అభద్రతాభావం మొదలైంది. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఏ క్షణాన ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంతో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రమూలాలు ఉన్నాయని తేలింది. దీంతో తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తీవ్రంగా గస్తీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు పన్నిన భగ్నం చేశారు. నగరంలో విధ్వంసానికి కుట్ర చేసిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ , సయ్యద్ సమీర్ లను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన సిరాజ్, సమీర్ లకు ఐసిస్ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దుండగులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్చేసేందుకు వీరు యత్నించినట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఫేక్ న్యూస్ కు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.