కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. ముంచే ప్రభుత్వం అని విమర్శించారు. 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి.. ఒక పథకంను కూడా అమలు చేయడానికి వారికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు సూపర్ అమలు చేశామని చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. ఒక్క పథకంను అమలు చేయకుండా, ఒక్క అభివృద్ధి పని చేయకుండా.. అన్ని చేశామని చంద్రబాబు చెప్పడంపై ప్రజలు తమను తాము గిల్లి మరీ చూసుకుంటున్నారన్నారు. 30 లక్షల మంది తల్లులకు ‘తల్లికి వందనం’ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని రోజా మండిపడ్డారు. సోమవారం తిరుపతిలో మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.
‘143 హామీలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఒక పథకంను అమలు చేయడానికి వారికి మనసు రాలేదు. సీఎం చంద్రబాబు సూపర్ అమలు చేశామని చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఒక్క పథకంను అమలు చేయకుండా, ఒక్క అభివృద్ధి పని చేయకుండా.. అన్ని చేశామని చంద్రబాబు చెప్పడంపై ప్రజలు తమను తాము గిల్లి మరీ చూసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అమ్మ ఓడి ఇవ్వలేదు, విద్యాదీవెన ఇవ్వలేదు.. ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చేలేదు. వైఎస్ జగన్ పొదలి పర్యటనకు వచ్చిన ప్రజలను చూసి భయపడి రాత్రి ‘తల్లికి వందనం’ జీవో విడుదల చేశారు. 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. తల్లికి వందనం పథకం కాదు తల్లికి కోతల పథకం అది’ అని ఆర్కే రోజా విమర్శించారు.
‘ఒకే అకౌంట్లో, ఒకే ఆధార్ నెంబర్తో 80-100 మంది పిల్లలకు ఎలా డబ్బులు పడ్డాయి?.. ఈ డబ్బలు ఎక్కడికి వెలుతున్నాయి. కెమెరాల ముందు సవాలు చేయడం, తొడలు కొట్టడం కరెక్ట్ కాదు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనమయ్యాయి. సవాల్ చేయడానికి లోకేష్ గారికి ఏ అర్హత ఉంది?. కేవలం పబ్లిసిటీ కోసమే పథకాలు ఇస్తూ అన్నిటిలో కోతలు విదిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. వైఎస్ జగన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం మానుకొని.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి చూపించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం పక్కనపెట్టి.. ఎల్లో బుక్ హామీలు అమలు చేయాలి. రాష్ట్రంలోకి గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా తీసుకొచ్చి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన రోజు తొందరలోనే ఉంది. వెన్నుపోటు పుస్తకాన్ని ప్రతి ఓటర్కు అందించి.. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరిస్తాం, మీ మెడలు వంచి శిక్ష వేస్తాం’ అని ఆర్కే రోజా హెచ్చరించారు.