Monday, June 16, 2025
HomeBlogఇచ్చిన మాట కోసం.. ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకున్న ప్రియుడు

ఇచ్చిన మాట కోసం.. ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకున్న ప్రియుడు

నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ప్రేమించిన ప్రియురాలితో కలిసి బ్రతకాలని కలలకన్నాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో ప్రియురాలిని కోల్పోయాడు. అయితే ఇచ్చిన మాట కోసం తన ప్రేయసి మృతదేహాన్ని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా చోటుచేసుకుంది. వివాహం చేయడానికి వచ్చిన పురోహితుడు వేద మంత్రాలు పఠించి వివాహాన్ని పూర్తి చేశాడు. మంగళగీత్ పాడటానికి బదులుగా, మహిళలు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఆ యువకుడు స్థానిక నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఇంటి యజమాని కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయిత ఈ విషయం ఇంట్లో తెలియగానే కుటుంబం మొదట నిరాకరించింది. కానీ ఇద్దరి పట్టుదలకు తలొగ్గి వివాహానికి అంగీకరించింది. ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకుని స్థిరపడాలని కలలు కన్నారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఆ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తన ప్రియురాలి మరణ వార్త విని ప్రేమికుడు కలత చెంది తన ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు. ఆమెను తన భార్యగా చేసుకుంటానని తాను హామీ ఇచ్చానని చెప్పాడు. కలిసి ఉంటానని ఇచ్చిన హామీ నెరవేరకపోవచ్చు కానీ ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకుంటానని తెలిపాడు. యువకుడి నిర్ణయంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇద్దరి మధ్య ప్రేమను చూసి ఏడుస్తున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. వేద మంత్రాల మధ్య ప్రియురాలి మృతదేహాన్ని ప్రేమికుడు వివాహం చేసుకున్నాడు. ఆమె నుదిటన సింధూరం రాశారు. వివాహితగా ఉన్న అమ్మాయి మృతదేహాన్ని బయటకు తీశారు. దీని తర్వాత, ప్రేమికుడు శ్మశాన వాటికకు చేరుకుని భర్తగా ఆమె అంత్యక్రియలు నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments