సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ ఎక్స్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ ద్వారా నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, రూ.5526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారన్నారు. రానున్న రోజుల్లో మరలా ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలన డిమాండ్ చేశారు.‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏపీఎండీసీ ద్వారా మళ్లీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.రూ.5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మరలా అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్లీ మళ్లీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగం లోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే. 9 వేల కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన 1.91 లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా ఏపీఎండీసీపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఏడాదిలోనే చేశారు’ అని వైఎస్ జగన్ ఎక్స్లో రాసుకొచ్చారు.