- ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం ఏపీ రైతులకు కొత్త అవకాశాలకు నాంది
- ఆస్ట్రేలియాలో ఏపీ ఆక్వా రైతుల అభివృద్ధి దిశగా మంత్రి లోకేష్ ఆలోచనలకు మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు
అమరావతి, జయ జయహే రాష్ట్ర ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయం అని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం కొత్త అవకాశాలకు నాంది కానుందని ఆయన అన్నారు. అమెరికా విధించిన అధిక సుంకాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏపీ ఆక్వా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించాలనే లోకేష్ దూరదృష్టి ప్రశంసనీయం అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఏపీ ఆక్వా రైతుల అభివృద్ధి దిశగా ఆలోచించిన మంత్రి లోకేష్ నిబద్ధతను ఆయన అభినందించారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపు, నిల్వ సామర్థ్యం, ప్రాసెసింగ్, కోల్డ్ చైన్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.
ఏపీ సీ ఫుడ్ బ్రాండ్కి అంతర్జాతీయ గుర్తింపు తేవాలన్న మంత్రి లోకేష్ సంకల్పం రాష్ట్రానికి గౌరవం తెస్తుందని అన్నారు. రాష్ట్రానికి 1,000 కిలోమీటర్ల విస్తీర్ణం గల సముద్రతీరం ఆక్వా పరిశ్రమకు బలమైన ఆధారమని, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక రంగాల్లో మంత్రి లోకేష్ చూపుతున్న ప్రగతిశీల ఆలోచనలను ప్రశంసిస్తూ, వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీతో సంయుక్త పరిశోధన కార్యక్రమాలకు తీసుకుంటున్న చర్యలు ఆహ్వానించదగినవని అన్నారు. రైతులకు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నాలజీ అందించే చర్యలు ప్రశంసనీయం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడుల వర్షం కురుస్తోందని, ఆక్వా రంగం అభివృద్ధి ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

