రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేసీఆర్, కిషన్ రెడ్డిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే.. మొదట తెలంగాణకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, ప్రాజెక్టుల అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్తుంది.. కేంద్రం సైతం ఆంధ్రప్రదేశ్ నిర్మించనున్న ప్రాజెక్టులపై సమావేశాలు నిర్వహిస్తుంది.. దాంతో తెలంగాణ ఆందోళన పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ తో వివాదాలు కోరుకోవడం లేదు.. అదే సమయంలో ఎవరి కోసమో మా హక్కులను వదులుకోమని తేల్చి చెప్పారు. చర్చల ద్వారానే పరిష్కారమని తెలంగాణ విశ్వసిస్తుంది.. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రావొద్దనే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక, బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం.. మాకు ఎగువ దిగువ రాష్ట్రాలు ఉన్నాయి.. పై రాష్ట్రాలతో సమస్య ఉంటే ఆంధ్రప్రదేశ్ తో కలిసి మాట్లాడాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పారు. ఇక, బనకచర్ల ప్రాజెక్టుకు పునాది పడింది కేసీఆర్ హయాంలో.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సెంటిమెంటును అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ ఇంతకాలం బ్రతికింది.. ఇప్పుడు టిఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయింది అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జలాలను ఆధారంగా చేసుకుని పునర్జీవనం కోసం ఆ పార్టీ ప్రయత్నం చేస్తుందిని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అయితే, పొడుగ్గా పెరిగినంత మాత్రాన తెలివి ఉందనుకోవడం సరైనది కాదు.. హరీష్ రావు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జ్ఞానానికి పొడవు ఆధారం కాదు.. 2016లోనే బనకచర్ల ప్రాజెక్టు కోసం పునాదిరాయి పడిందన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి.. ఆ ప్రాజెక్టులకు నీళ్లు ఉపయోగించిన తర్వాత మిగిలిన నీళ్లు వరద నీళ్లు అనేది తేలుతుంది.. కాబట్టి, కూర్చుని చర్చిస్తే ఎవరి గ్రీవెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది.. తెలంగాణ సమస్య పరిష్కరించుకోవడానికే నా ప్రయత్నం.. కేంద్రంపై కానీ, ఏపీ ప్రభుత్వం కానీ ఎటువంటి కామెంట్స్ చేయను.. డిస్కషన్ కోరుకుంటున్నాం, లిటిగేషన్స్ అవసరం లేదని పేర్కొన్నారు. ఒక్కరోజు కాదు నాలుగు రోజులైనా సరే కూర్చొని మాట్లాడుకొని న్యాయపరంగా, సాంకేతికపరంగా పరిష్కరించుకోవాలని వెల్లడించారు. నేరుగా కేంద్రం వద్దకు ఆంధ్రప్రదేశ్ సీఎం వెళ్తున్నారు.. ఆ ప్రాజెక్టుల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. కేంద్ర మంత్రులు సైతం మీటింగులు పెట్టి అనుమతులపై చర్చిస్తున్నారు.. అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులని కలుస్తున్నాం.. వాటి విషయంలో ఎటువంటి డెడ్ లైన్ పెట్టేది లేదు.. అధికారం పోయి అసహనంతో హరీష్ రావు మాట్లాడుతున్నారు అని సీఎం రేవంత్ తెలిపారు.
కాగా, కేసీఆర్, హరీష్ రావులు అడ్డగోలు తప్పులు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళ అబద్ధాలకు దేవుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు.. బీజేపీ గెలిచేందుకు తెలంగాణలో టీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది.. దాంతో కమలం పార్టీ 8 సీట్లలో విజయం సాధించిందన్నారు. ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్ కు రాలేదు.. ఢిల్లీలో వేరే పనులు ఉన్నాయని చెప్పారు.. కానీ, మేము కలవాలనుకున్న కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్లను ఆయన ముందు రోజు కలిశారు.. కిషన్ రెడ్డికి ట్యూటర్ కేటీఆర్.. కేటీఆర్ ను తెలంగాణలో ట్విట్టర్ టిల్లు అని పిలుస్తామని సెటైర్లు వేశారు. ఇక, ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ పై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.