ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇక, ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. 25 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అమిత్షాకు వివరించారు నారా లోకేష్.. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని.. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు గారి సుదీర్ఘ పాలన అనుభవం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు..
ఇక, అంతకుముందు, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు నారా లోకేష్.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాను. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరాను. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పగా, ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిని వివరించాను. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని నేను ఎంచుకున్నానని చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకుని పోరాడానని ధన్కర్ తెలిపారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశాను అని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..