మురళీ నాయక్ కు పవన్, లోకేశ్ ఘన నివాళులు
రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
మృతుని తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం
జయజయహే : ‘మన దేశం ఎప్పుడూ యుద్ధం కావాలని కోరుకోలేదు. పొరుగు దేశాల మీద యుద్ధాలు చేసిందీ లేదు. మనల్ని మనం సంరక్షించుకోవడానికి ఇప్పుడు యుద్ధం చేయక తప్పని పరిస్థితి. పాకిస్థానే ఈ పరిస్థితికి కారణమ’ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తోక జాడించిందన్నారు. కాల్పుల విరమణను మనం ఎవరూ నమ్మవద్దన్నారు. పాకిస్థాన్ అరాచకాలు మన దేశానికి ఇబ్బందిగా మారాయని చెప్పారు. ఈ దుశ్చర్యలకు ఎక్కడో ఒక చోట ముగింపు పలికేలా పాకిస్థాన్ కు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అమర జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి ఆదివారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో నివాళులు అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతి బాయి, శ్రీరాం నాయక్ ను ఓదార్చారు. చిన్న వయసులో మురళీ నాయక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి నేపథ్యంలోనే పాకిస్థాన్ కి అండగా ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద భారత ఆర్మీ దాడి చేసి ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసింది. అందుకు ప్రతిగా సరిహద్దుల్లో పాకిస్థాన్ కూడా కాల్పులు ప్రారంభించడంతో దేశంలోని ఐదు సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల్లో అగ్నివీర్ గా 2022లో విధుల్లో చేరిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళీ నాయక్ అమరులయ్యారు. రైల్వే ఉద్యోగం వచ్చినా కాదనుకుని దేశం కోసం పని చేయాలనుకున్న యువకుడు మురళీ నాయక్. అవసరం అయితే దేశం కోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి సైన్యంలో చేరిన 23 ఏళ్ల మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవాల్సి రావడం బాధాకరం. సరిహద్దుల్లో ఉగ్రదాడులు, యుద్ధాలు జరిగితే దాని ప్రభావం దేశం మొత్తం కనబడుతుంది అనడానికి ఇది మరో ఉదాహరణ. చిన్న వయసులోనే ఈ అగ్నివీరుడు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో దేశానికి ముప్పు
ఉగ్రదాడికి వారం రోజుల ముందు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను ప్రేరేపించి దాడికి ఉసిగొల్పారు. అనేక మంది అమాయకుల ప్రాణాలు అన్యాయంగా బలిగొన్నారు. 1947లో దేశం నుంచి విడిపోయారు. నాలుగుసార్లు యుద్ధాలు చేశారు. ఇప్పటికీ అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు. అయినా పాకిస్థాన్ దాహం తీరలేదు. నిన్నటికి నిన్న కాల్పుల విరమణ అని ఒప్పుకొని దాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వం అది. పాకిస్థాన్ కి ఒక విధానం అంటూ లేదు. వాళ్లు చేసే అరాచకాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు భారత దేశానికి ఇబ్బందిగా మారాయి. ఢిల్లీ, ముంబై దాడులు కావచ్చు. కశ్మీర్ లో కావచ్చు, కోయంబత్తూర్, జమా మసీద్ పేలుళ్లు, గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లు కావచ్చు. వీటన్నింటికీ ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. ప్రధాని మోదీ ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించాం. ఆ కుటుంబానికి ఐదు ఎకరాల స్థలం, 300 గజాల ఇంటి స్థలంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఆ కుటుంబానికి ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీర జవాను కుటుంబానికి నా వ్యక్తిగతంగా రూ. 25 లక్షల సాయం చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రధాన మంత్రి మోదీకి, నాయకులకు, సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉండాలి. ప్రతి ఒక్కరు అప్రమత్తతతో ఉండాలి. తీవ్రవాదులు దేశం మీద రకరకాల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాల్పుల విరమణను ఎవరూ నమ్మవద్దు. కాల్పుల విరమణ శాంతికి ఒప్పందం కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే ఉల్లంఘనకు పాల్పడ్డారు. మురళీ నాయక్ నా అభిమాని కూడా అని తెలిసి చాలా బాధ కలిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు రావడం బాధాకరం. మురళీ నాయక్ అందరికంటే దేశాన్ని ప్రేమించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధ కలిగించింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది” అన్నారు. జోహార్ మురళీ నాయక్ అంటూ నినదించారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, పార్లమెంటు సభ్యులు పార్థసారధి, శాసన సభ్యులు అరవ శ్రీధర్, దగ్గుబాటి ప్రసాద్, పల్లె సింధూరరెడ్డి, ఎం.ఎస్. రాజు, హౌడా ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.